సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నీటి విలువ గురించి వివరించారు. చెన్నై నగరంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో, తాను ప్రత్యక్షంగా అనుభవించానని తెలిపారు. తాను స్నానం చేద్దామంటే నీళ్లు లేవని, అర బకెట్ నీళ్ల కోసం అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ‘గూర్ఖా’ అనే తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న ఎస్పీబీ, సభికులు అంతా నీటి పొదుపును పాటించాలని హితవు పలికారు. బంగారం, ప్లాటినం కన్నా నీరు విలువైనదని అన్నారు.
భావి తరాలకు పుష్కలమైన ఆస్తిపాస్తులు ఇవ్వడం కన్నా, నీటిని పొదుపు చేసి అందించడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. మా ఇంట్లో నేను స్నానానికి అర బకెట్ నీళ్లకు అరగంట వేచి చూశాను. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు. ఓ ముఖ్యమైన విషయం చెబుతున్నాను. నగరంలో నీటి ఎద్దడి బాగా ఉంది. అందుకు మనమే కారణం. నీటిని పొదుపు చేయండి.ప్లేట్ లో తినే బదులు విస్తరాకుల్లో తింటే నీరు ఆదా అవుతుంది. ప్రతిరోజూ బట్టలను మార్చే బదులు, వారంలో రెండు జతలు మాత్రమే ధరిస్తే, ఉతికేందుకు ఖర్చయ్యే నీరు మిగులుతుంది. నీరు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.