ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండేళ్ళ పాటు ఎంతో శ్రమించి తెరకెక్కించిన సాహోకి డివైడ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. కొన్ని చోట్ల విధ్వంసం కూడా సృష్టించారు. అయితే చిత్ర రిజల్ట్పై ప్రభాస్ కాని, సుజీత్ కాని స్పందిస్తారేమోనని ఎదురు చూస్తున్న క్రమంలో దర్శకుడు సుజీత్ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగపు పోస్ట్ చేశారు. “నేను 17 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు లఘు చిత్రం తెరకెక్కించాను. ఆ సమయంలో డబ్బులు లేవు, ఒక టీం లేదు. కేవలం నా ఫ్యామిలీ, ఆర్కుట్ ఇవి రెండు మాత్రమే నాకు మద్దతుగా ఉండేవి. నా లఘు చిత్రాలకి 90 శాతం ఎడిటింగ్, డైరెక్షన్, కెమెరా వర్క్ నేనే చేశాను. ఆ సమయంలో నేను చేసిన తప్పుల నుండి చాలా నేర్చుకున్నాను. విమర్శకుల విమర్శలు నాకు ఎల్లప్పుడు ఓ ప్రోత్సాహంలాగా అనిపిస్తుంటుంది. చాలా దూరం ప్రయాణించి, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. కాని సాధించాలనుకున్నది ఎప్పుడు వదిలి పెట్టలేదు. ఈ రోజు సాహో చిత్రాన్ని కొంత మంది ప్రజలు చూశారు. ఈ చిత్రం నుండి కొందరు చాలా ఆశించారు. కొందరు చాలా ఇష్టపడ్డారు. సినిమా చూసిన వారందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఏదైన మిస్ అయితే మరొకసారి సినిమా చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను హామీ ఇస్తున్నాను” అని సుజీత్ తన పోస్ట్లో పేర్కొన్నాడు.