తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతొంది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ ప్రారంభం కాగానే హైదరాబాద్ శంషాబాద్ బూత్లో గొడవ జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ బూత్లోకి ఇద్దరు అభ్యర్థులు సెల్ఫోన్లు తీసుకొచ్చారు.
అయితే ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో గొడవపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో భాగంగా 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 741మంది పోటీ చేస్తున్నారు. ఇక 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 5,723మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.