telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్యాంకుల పరిస్థితికి .. గత ప్రధానే కారణం.. : నిర్మలాసీతారాం

Nirmala seetharaman

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ల నిర్ణయాలతోనే భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు దారుణంగా దిగజారిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. ఈ ఇరువురి కారణంగా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆగమాగమైందని విరుచుకుపడ్డారు. చావుబతుకుల్లో ఉన్న బ్యాంకులకు తిరిగి ప్రాణం పోసే పనిలో ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్.. మంగళవారం ఇక్కడ ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్, పబ్లిక్ అఫైర్స్ వద్ద భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు-అవకాశాలు అన్న అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. మన్మోహన్, రాజన్ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ప్రమాదకర స్థాయికి చేరాయని, వాటిని పరిష్కరించే బాధ్యత తాము తీసుకున్నామని చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయాన్ని అందించామని గుర్తుచేశారు. అంతేగాక 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేశామని తెలిపారు. రాజన్ హయాంలో ఇష్టారాజ్యంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు.. పెద్ద ఎత్తున మొండి బకాయిలుగా పేరుకుపోయాయని మండిపడ్డారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని, కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని ఆయన భ్రష్ఠుపట్టించడం వల్లే ఇప్పుడీ దుస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్, రాజన్‌ల హయానికి ముందు భారత బ్యాంకులు బలంగా ఉన్నాయనీ నొక్కిచెప్పారు. గత మార్చి ఆఖరు నుంచి ఈ ఏడాది మార్చి చివరిదాకా ఏడాది కాలంలో ఎన్‌పీఏలను రూ.89,189 కోట్లు తగ్గించామన్న మంత్రి.. ఈ మార్చి 31 నాటికి భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా, ప్రొఫెసర్, ప్రముఖ ఆర్థిక వేత్త జగదీష్ భగవతీ, న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు.

Related posts