పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కూడా హీరో రామ్ పాత్రను హైపర్ యాక్టివ్ గా డిజైన్ చేశారు. రామ్ తో పాటు నభా నటేష్ పాత్రని బాగా హైపర్ గా చూపిస్తున్నారు. రామ్ పాత్రకు ఏమాత్రం తీసిపోకుండా నభా పాత్ర కూడా ఉంటుందని టాక్. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది నభా నటేష్. ”ఈ సినిమా కోసం రామ్ నా చేతిలో దెబ్బలు తిన్నాడు. అదెందుకో సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. తను చిన్నప్పటి నుండి చాలా హైపర్ గా ఉండేదాన్నని, ఇప్పుడు తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయని చెప్పింది. ఈ సినిమా కోసం నభా తెలంగాణా యాసని ప్రత్యేకంగా నేర్చుకుందట. తెలంగాణా యాస మాట్లాడడం తనకు చాలా కష్టంగా అనిపించేదని, అందుకే కాస్త టైం పట్టిందని, అయితే డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదని, త్వరలోనే ఆ ప్రయత్నం కూడా చేస్తానని అంటోంది. ప్రస్తుతం నభా, రవితేజ నటిస్తోన్న ‘డిస్కో రాజా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.