భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత నారా లోకేష్ కు మాత్రమే ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, టీడీపీయే అధికారంలో ఉండాలని అన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిస్తున్నామని చెప్పారు. జన్మభూమి ద్వారా ప్రజా ప్రతినిధులను ప్రజల ముందుకు తీసుకు వచ్చి నిలిపిన ఘనత చంద్రబాబుదేనని కేశినేని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేశామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయనకు సమాధానం చెప్పేందుకు తానొక్కడినే సరిపోతానని అన్నారు.