పురుషాధిక్య క్రికెట్ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్ .39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్లో తన సత్తా చాటారు. మిథాలీ రాజ్ జీవితం వర్ధమాన క్రికెటర్లకు ఎంతో ఆదర్శం.
తన 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు.. మరెన్నో రికార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మహిళల క్రికెట్లో ఇంకెవరికీ సాధ్యంకాని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సుమారు 30 ఏళ్లుగా ఫిట్నెస్ కాపాడుకుంటూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా కెరీర్ కొనసాగిస్తూ వచ్చారు.
మిథాలీ రాజ్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు ఆమె . 232 వన్డే మ్యాచ్లు ఆడిన మిథాలీ.. 7,805 పరుగులు రాబట్టింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా ఉంది. అందులో 7 సెంచరీలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి. కెరీర్ లో 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. అందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఫార్మాట్ లో మిథాలీ రాజ్ నెలకొల్పిన అత్యధిక స్కోరు 214 పరుగులు. మరోవైపు పొట్టి ఫార్మాట్ (టీ20) టీమ్ఇండియా తరఫున 89 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్.. 2,364 పరుగులను సాధించింది. వాటిలో 17 హాఫ్ సెంచరీలు .
1999లో మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. చివరిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్కప్-2022లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు.
తాను ఆడిన తన తొలి వన్డేలో ఐర్లాండ్పై 114 పరుగులు చేసి సత్తా చాటారు . 22 ఏళ్లకు పైగా ప్రపంచ వన్డే క్రికెట్లో కొనసాగుతున్న తొలి క్రికెటర్ మిథాలీ.
మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించింది. భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. క్రికెట్లో ఎంట్రీ కాకపోయుంటే..భరతనాట్యంలో ప్రావీణ్యురాలై ఉండేది.
మిథాలీ రాజ్ తండ్రి ధీరజ్ మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తండ్రి స్వతహాగా క్రికెటర్. మిథాలీను ప్రోత్సహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు తల్లిదండ్రులు.
2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 214 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది.
మిథాలీ రాజ్..2005లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్లో కెప్టెన్గా ఉంది. 2010, 2011, 2012లో వరుసగా ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉంది. లేటెస్ట్ గా మిథాలీ రాజ్ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డును అందుకున్నారు.