ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సంక్రాంతి పండగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 5వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు నగరంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 14 లక్షల మంది సందర్శకులు పతంగుల పండగను తిలకించినట్లు టూరిజం అధికారులు తెలిపారు. గత ఏడాది 10 లక్షల మంది రాగా, ఈసారి సందర్శకుల సంఖ్య ఒక వంతు ఎక్కువగా పెరిగిందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా నైలాన్ క్లాత్, పాలిమర్తో తయారు చేసిన దాదాపు 200 రకాల అతిపెద్ద పతంగులను ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ ఎగురవేసి సందర్శకులను అబ్బురపరిచారు. చివరి రోజు ఎగురవేసిన గుర్రం, మిక్కీమౌస్, పండ్ల ఆకారాలు, బల్లి, జోకర్, పిల్లి, గరుడ పక్షి, లాఫింగ్ పతంగులు పిల్లలను ఎంతో ఆకట్టుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వర కు మైదానంలోని బారికే డ్ల భద్రత నడుమ అంత ర్జాతీయ కైట్ ఫ్లయర్స్ భారీ పతంగులను ఎగురవేయగా, మిగిలిన ఖాళీ స్థలంలో నగరానికి చెందిన యువతీ యువకులు కాగితపు పతంగులను ఎగురవేశారు.
సింగపూర్ కైట్ ఫ్లయర్స్ రాత్రివేళలో రిమోట్ సెన్సింగ్ ఆపరేటింగ్తో ఆకాశంలో తిప్పిన కైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘నో ప్లాస్టిక్.. నో మాంజా’ నినాదంతో మాంజా రహితమైన సాధారణమైన తెలుపురంగుతో కూడిన దారంతో పతంగులను ఎగురవేశారు. స్వీట్ ఫెస్టివల్లో దేశంలోని 24 రాష్ర్టాలకు చెందిన మహిళలు తమ ప్రాంతంలో ప్రత్యేకత కలిగిన స్వీట్లను తయారు చేసి అమ్మకానికి పెట్టారు. దీంతో నగరవాసులు తమకు నచ్చిన స్వీట్లను కొనుగోలు చేసి తింటూ పతంగులను ఆసక్తిగా తిలకించారు. గతానికి భిన్నంగా ఈసారి కైట్, స్వీట్ ఫెస్టివల్తోపాటు జింఖానా గ్రౌండ్స్లో యువతీ, యువకులు, మహిళలకు గిల్లీదండా, గోనెసంచి, తొక్కుడు బిల్ల, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ లాంటి సంప్రదాయ ఆటలు ఆడించారు.