పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలంగాణా యాసతో బోల్డ్ డైలాగ్స్ తో ట్రైలర్ ని నింపేశారు. కొందరికి ఈ ట్రైలర్ నచ్చితే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ట్రైలర్ చాలా లౌడ్ గా ఉందని, తెలంగాణా నేపధ్యంలో, భాష, యాస కృత్రిమంగా ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. హీరో తలలో పోలీసులు ఒక చిప్ పెడతారు.. దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ట్రైలర్ చూసిన వాళ్లు ఇది పూరి ఆలోచన కాదని ఓ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారని అంటున్నారు. మూడేళ్ల క్రితం హాలీవుడ్ లో రిలీజైన ‘క్రిమినల్’ సినిమా నుండి ‘ఇస్మార్ట్ శంకర్’ ప్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘క్రిమినల్’ సినిమా ట్రైలర్ ని చూస్తే ఆ విషయం అర్ధమవుతోంది అంటున్నారు. మరి ఈ విషయంపై పూరి ఏమంటాడో చూడాలి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
previous post