నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 విశాఖ నగరంలో జరగనుంది. మ్యాచ్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు మ్యాచ్ల సీరిస్లో భాగంగా జరిగే ఈ తొలి మ్యాచ్ కు, బ్యాటింగ్ స్వర్గధామంగా పేరొందిన పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఈమ్యాచ్కి మాత్రం రెండు రోజుల ముందే అన్ని ధరల టికెట్లు అమ్ముడు పోవడం మ్యాచ్పై అభిమానుల క్రేజ్కి నిదర్శనం. స్టేడియం సామర్థ్యం 27,500 కాగా, మొత్తం టికెట్లు అమ్ముడు పోవడంతో నిర్వాహకుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే, ప్రపంచ కప్కు ముందు టీమ్ ఇండియాకు చివరి సన్నాహక మ్యాచ్లివి. ఆస్ట్రేలియాతో జరిగే టీ20, వన్డేల్లో సత్తాచాటితే ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్పులోకి అడుగు పెట్టవచ్చని ఆతిథ్య దేశం అంచనా. సొంతగడ్డ, అభిమానుల అండ ఎలాగూ కలిసి వస్తుందని భారత్ భావిస్తోంది. ఆల్రౌండర్ హార్డిక్ పాండ్యా జట్టుకు దూరమైనా కెప్టెన్ కోహ్లీ చేరికతో జట్టు సమతూకంతో ఉంది. బ్యాటింగ్ పరంగా భారత్కు ఎటువంటి సమస్య లేదు. ఓపెనర్లు రోహిత్, ధావన్లు శుభారంభాన్ని అందిస్తే ఆ తర్వాత ధోనీ, కోహ్లీ, రిషబ్పంత్లు మిగిలిన పని పూర్తి చేస్తారు. ఆల్రౌండర్లు విజయ్శంకర్, కృనాల్ పాండ్యాలు బ్యాటింగ్లోనూ ఆకట్టుకుంటుండడం జట్టుకు అదనపు బలం.
బౌలింగ్ విభాగంలోనూ భారత్ బలంగానే ఉంది. భువనేశ్వర్, కులదీప్యాదవ్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చినా ఉమేష్యాదవ్, బుమ్రా, చాహల్, కౌల్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఆస్ట్రేలియా టూర్లో తన స్పిన్ మాయాజాలంతో కంగారులను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్ సొంతగడ్డపై వారిని ఓ ‘ఆట’ ఆడుకుంటాడనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ సజావుగా సాగేందుకు వీలుగా 1500 మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.