నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించారు. ఈ క్రూర మృగాలు ఒక్క రోజు కూడా అదనంగా జీవించడానికి వీల్లేదని ఆయన అన్నారు. వారు జీవించే ప్రతి రోజు… న్యాయ వ్యవస్థకు మచ్చ వంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.నిర్భయ దారుణం జరిగి ఏడేళ్లయిందని, ఆమె తల్లి ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని ప్రశ్నించారు. దోషులను వెంటనే ఉరి తీయాలని అన్నారు.
డెత్ వారెంట్ ప్రకారం ఈ ఉదయం నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉంది. కానీ, ఉరికి వ్యతిరేకంగా తమకున్న మార్గాలు ఇంకా పూర్తి కాలేదని ముగ్గురు దోషులు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశం కూడా తమకు ఉందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ డెత్ వారెంట్ ను వాయిదా వేయాలని విన్నవించారు. దీంతో దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది.