సెలెబ్రిటీలపై అభిమానం పెంచుకుంటే వాళ్ళు ఎంత పనైనా చేస్తుంటారు. అవి ఏమేమితో, ఎలాంటివో ప్రత్యేకించి చెప్పాల్సిన పని కూడా లేదు. రోజు ఎవరో ఒక అభిమాని తన ఇష్టమైన సెలబ్రిటీ కోసం ఏదో ఒకటి చేసినట్టు వివిధ వార్తా మాధ్యమాలలో చూస్తూనే ఉంటాం.. తాజాగా, ఒక కుర్రాడు వీరాభిమానంతో ఏకంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను కలిసేందుకు ఆ కుర్రాడు ఏకంగా 900 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. గుజరాత్ కు చెందిన పర్బత్ అనే యువకుడు హీరో అక్షయ్ కుమార్ కు వీరాభిమాని. ఎలాగైనా అక్షయ్ కుమార్ ను ఆకట్టుకోవాలని, అతడిని కలవాలని నిర్ణయించుకున్న పర్బత్ గుజరాత్ లోని ద్వారక పట్టణం నుంచి ముంబయి బయల్దేరాడు. అది కూడా కాలినడకన.
18 రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చివరికి ముంబయి చేరుకున్నాడు. పర్బత్ గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్ అతడి అభిమానానికి కదిలిపోయినా, అతడు చేసిన సాహసం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. అంతటి శక్తిని జీవితాన్ని సాఫల్యం చేసుకునేందుకు ఉపయోగించాలి తప్ప, ఇలాంటి అర్థంలేని సాహసాలకు మాత్రం వినియోగించవద్దు అంటూ పర్బత్ కు హితవు పలికాడు. మరోసారి ఇలాంటి పనలు చేయవద్దంటూ మందలించాడు. ఆ కుర్రాడితో ఫొటోలు దిగిన అక్షయ్ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.