ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా… అందులో భాగంగా తెలంగాణకు 3.72 లక్షల డోసులను పంపించింది కేంద్రం.. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తరలింపు మంగళవారం వేకువ జామున ప్రారంభమైంది. అక్కడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయానికి చేరుకుంది వ్యాక్సిన్… మొత్తం 31 బాక్సుల్లో 3.72 డోసుల టీకాలు తెలంగాణకు వచ్చాయి. ఈ టీకాను రాష్ట్రంలోని 866 కోల్డ్ స్టోరేజీ పాయింట్లకు తరలించి భద్రపర్చనున్నారు. ఇక, కోఠిలోని ఇమ్యునైజేషన్ బిల్డింగ్ కు చేరుకున్నాయి వ్యాక్సిన్లు.. అక్కడ వాక్సిన్ ను రిసీవ్ చేసుకున్నారు హెల్త్ సెక్రటరీ రిజివి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. ఈ వ్యాక్సిన్లనే 16 నుంచి తెలంగాణలో అందించాలని నిర్ణయించారు.. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి.. ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర ఫ్రంట్లైన్ వర్కర్లకు అందిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత 50 ఏండ్లకు పైబడిన వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో అందించాలని నిర్ణయించినట్టు సోమవారం రోజే వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1213 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ను తరలించేందుకు 866 కోల్డ్చైన్ పాయింట్లను ఏర్పాటు చేశాం’ అని సీఎం పేర్కొన్నారు.