బాలీవుడ్ నటుడి భార్య విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం బాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. నాటకాలు, టీవీ షోలతో పాటు ‘లగాన్’, ‘సూయి ధాగా’, ‘న్యూటన్’, ‘పిప్లీ లైవ్’ వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన రఘుబీర్ యాదవ్ మాజీ భార్య పూర్ణిమా ఖర్గా మరోసారి కోర్టు తలుపు తట్టారు. 32 ఏళ్ల తర్వాత తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరో మహిళతో వివాహేతర సంబంధం నడుపుతూ తనని రఘుబీర్ మోసం చేశాడని ఆరోపించారామె. నటుడు సంజయ్ మిశ్రా (తెలుగులో కిక్ 2 చిత్రంలో నటించాడు) భార్య రోషిణి అచ్రేజాతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరికీ 14 ఏళ్ల కొడుకు ఉన్నట్లు రఘుబీరే స్వయంగా కోర్టులో ఒప్పుకున్నారని చెప్పారు. తమ పెళ్లైన ఏడేళ్లకే నటి నందితా దాస్తో ప్రేమ పడ్డారని వెల్లడించారు. ‘రాజ్ భరోట్’ టీవీ సీరియల్లో నటించినప్పుడు వారిద్దరూ ప్రేమించుకున్నారని తెలిపారు. అయితే గతంలో కూడా పూర్ణిమా ఖర్గా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి, మనసు మార్చుకుని దరఖాస్తును వెనక్కు తీసుకున్నారు. భరణం కింద రఘుబీర్ నుంచి నెలకు రూ.40 వేలు అందుకుంటున్నారు పూర్ణిమ. గత కొన్ని నెలలుగా భరణం ఇవ్వడం లేదని.. భరణం కూడా ఇవ్వకుండా ఉండేందుకు ఆస్తిని అచ్రేజా పేరు మీదకు బదిలీ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారి ఖర్చుల నిమిత్తం ప్రస్తుతానికి రఘుబీర్ నుంచి లక్ష రూపాయలు ఇప్పించాలని తాజా పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. భరణం కింద రూ.10 కోట్లు ఇప్పించి విడాకులు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై రఘుబీర్ స్పందించాల్సి ఉంది.
previous post