ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రజనీపై భారతీరాజా విరుచుకుపడ్డారు. ఇటీవల రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు నాలుగువందల కోట్లు వసూలు చేసిందన్న ప్రచారం జరిగింది. అయితే బయ్యర్స్ మాత్రం నష్టాలొచ్చాయని రజనీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ వివాదంపై భారతీరాజా మండిపడ్డారు. ఈ సినిమా నిర్మాణానికి 50 కోట్లకు మించి కాదనీ, సినిమా వసూలు చేసిన దానిలో నిర్మాణ ఖర్చును తీసిస్తే, మిగిలిన 350 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. నష్టాలు అన్నది ఓ డ్రామా మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు. రొమాంటిక్ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న భారతీరాజా సూపర్ స్టార్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.
previous post