కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించన రేవంత్.. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అనే తరహాలో రేవంత్ దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారు రేవంత్. ఇందులో భాగంగానే తాజాగా మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే కానీ శరీరాలే వేరని.. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ…ఏడేళ్లుగా మీరు చేస్తున్నది ఇదేనని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కేసీఆర్ బీజేపీపై యుద్ధం అన్నారు… తర్వాత ఢిల్లీ వెళ్లి మోదీతో రాజీ పడ్డారని రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మీరు మళ్లీ బీజేపీపై యుద్ధం అంటున్నారని..ఉత్తర కుమారుడిలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే…ఐటీఐఆర్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవదిక నిరహార దీక్షకు మీరు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. ఈ నెల 8న పార్లమెంట్ మలి విడత సమావేశమవుతోంది… దీక్షతో మోదీ పై ఒత్తిడి పెంచుదాం వస్తారా అని నిలదీశారు రేవంత్. తన సవాల్ కు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని… మీ దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్కు చురకలు అంటించారు. ఈ సవాల్ ను మీరు స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా శాశ్వతంగా మిగిలిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు.
next post
రేవంత్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం: తలసాని