ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ బాలు దేశం గర్వించే గొప్ప గాయకుడని కొనియాడారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గానగంధర్వుడు ఆయనని అభివర్ణించారు. ఆయన నిష్క్రమణ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు అని చెప్పారు.
బాలుగారితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన పాడిన నాన్నగారి పాటలను, తన పాటలను వినని రోజంటూ ఉండదని చెప్పారు. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం విచారకరమని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.