ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్రం ఇస్తామన్న రూ.4 వేల కోట్లకు ఆశపడే సీఎం జగన్ మీటర్ల బిగింపుకు సమ్మతించారని హరీష్ ఆరోపించారు. ఈ వ్యవహారం పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం తప్ప, వాటిని తమ జేబుల్లో వేసుకోబోమని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండడం, మరో రోజు గొడవ పడడం తమ నైజం కాదని చురక అంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని బాలినేని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని వివరించారు.