ఏపీ ప్రభుత్వం తప్పుడు వార్తలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఫేక్ న్యూస్ సృష్టించినా.. వాటిని షేర్ చేసినా ఇకపై కఠిన చర్యలు తప్పవని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించింది.
ప్రస్తుతం పలు మీడియా సంస్థలు పనిగట్టుకొని మరీ ప్రభుత్వంపై అసత్య కథనాలను ప్రసారం, ప్రచురణ చేస్తున్నారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను రూపొందిస్తున్నారని జగన్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తప్పుడు వార్తలను కట్టడి చేసి..ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి తప్పుడు వార్తా కథనాలు రాసే మీడియా హౌస్లపై చర్యలు తీసుకోవాలని.. ఆయా శాఖలపై వచ్చే కథనాలపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది.