ఏపీ రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత రైతులు ఆయా గ్రామాల్లో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు శిబిరానికి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో దీక్ష చేస్తున్న రాజధాని రైతులకు ప్రకాశం జిల్లా మార్టూరు, పిడుగురాళ్ల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి తమ సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేకపోవటంతో మంగళవారం జాతీయ రహదారులు దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్లు జేఏసీ సభ్యులు తెలిపారు. దళిత రైతులు, రైతుల కూలీలు ఉద్దండరాయునిపాలెంలోని రాజధానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు.
మందడంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని గల్లా జయదేవ్ కు మహిళలు ఫిర్యాదు చేశారు.