ఎన్నికల నేపథ్యంలో దేశంలో పొత్తుల పండుగ కనిపిస్తుంది. బద్ద శత్రువుల వంటి వారు కూడా ఎన్నికల సందర్భంగా అమితమిత్రులు అవడం ప్రజలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. దేశంలోనే కాంగ్రెస్-టీడీపీ కలయిక ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఇక తాజాగా, తమిళనాడులో పొత్తులకు ఒక ముగింపు వచ్చింది. రెండు ప్రధాన పార్టీలు కూడా చెరొక ప్రాంతీయ పార్టీతో జతకట్టారు. ఈ జత ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి అంతా సిద్ధం అయ్యిందట. అధికార పార్టీయైన అన్నాడిఎంకెతో బిజెపి పొత్తు కుదుర్చుకుని, సీట్ల సర్దుబాటు చేసుకున్న అనంతరం కాంగ్రెస్ కూడా డిఎంకెతో సీట్ల ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చింది.
రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలకు గానూ 10 స్థానాల్లో పోటీ చేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. పుదుచ్చేరిలోని ఒక స్థానంతో పాటు తమిళనాడులోని 9 స్థానాల్లో పోటీకి దిగనుంది. ‘ తమ మధ్య సానుకూల చర్యలు జరిగాయి. తమకు కేటాయించిన సీట్లతో తాము సంతృప్తిగా ఉన్నాం’ అని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ(టిఎన్సిసి) అధ్యక్షుడు కెఎస్ అళగిరి అన్నారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు. అయితే 10 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు డిఎంకె వర్గాలు వెల్లడించాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ముకులల్ వాక్స్నిక్ బుధవారం చెన్నై చేరుకుని డిఎంకె అధినేత స్టాలిన్తో కలిసి అధికారిక ప్రకటన చేయనున్నారు. రాష్ట్రంలో డిఎంకె వామపక్షాలతో పాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం.