వ్యవసాయమంటే మక్కువ, అంతకు మించి తన పరిసర గ్రామాల ప్రజలకు ఏదో ఒకటి చేయటమే కాదు, అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశం వెరసి ఆ పోలీసు అధికారిని పొలాల వైపుకు నడిపించాయి. ఇప్పుడు ఆయన ప్రతివారం తన సొంత పొలంలో పనిచేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లికి చెందిన రాం నరసింహారెడ్డి. ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎస్.ఐ గా ప్రస్థానం ప్రారంభించి, ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీ విభాగంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.
నరసింహారెడ్డి తన సోదరుడు సురేష్రెడ్డి జ్ఞాపకార్థం ట్రస్ట్ను నెలకొల్పి నిరుపేదలకు, కష్టంలో ఉన్న రైతాంగానికి ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నారు. ఇలా గ్రామంతో పాటు పరిసర పలు మండలాల ప్రజల సమస్యలు తెలుకునేందుకు వారం వారం రాం నరసింహారెడ్డి తన స్వగ్రామానికి వచ్చి అక్కడి ప్రజలతో గడుపుతుంటారు. ఈ క్రమంలో నే ఆ పోలీసు అధికారి సేద్యపు పనుల్లో నిమగ్నమవుతున్నారు, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తన వ్యవసాయ భూమిలో పొలం పనులు చేస్తూ కనిపించారు. హలం పట్టి పొలం పనులు చేస్తుండంతో రాం నరసింహారెడ్డి ఫోటో ఇప్పుడు వైరల్లా మారింది.
ఇది చాలా అవసరమైనదని విశ్లేషకులు అంటున్నారు. ఇలా భూమి ఉన్న ప్రతి ఒక్కరు కనీసం ఏడాది పాటు చేస్తే, దేశంలో కరువుకానీ, అధిక ధరలుకానీ ఉండవని వారు అంటున్నారు. తద్వారా అందరికి పౌష్ఠిక ఆహరం కూడా అందుతుందని.. ఇది దేశంలో చాలా విభాగాలలో సమూలమార్పులు కూడా తెగలదని వారు స్పష్టం చేశారు.