తెలంగాణలో ‘సారా-కారా’ కేసీఆర్ సర్కారు’ నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను రేవంత్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సారా తాగడం, కారా(మిక్చర్) తినడం పడుకోవడం తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ప్రజలకు ఇంతవరకూ ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనముందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలును చూడలేకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.సీఎం కేసీఆర్ పాత్ర గల్లీలో క్రికెట్ ఆడే గచ్చిబౌలి దివాకర్ లాంటిదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు జాతీయ స్థాయి పోటీలని అభిప్రాయపడ్డారు. అక్కడ వన్డేలు, టీ20లు, టెస్టు మ్యాచులు ఉంటాయన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రమే ఆటగాళ్లని స్పష్టం చేశారు. ఏమైనా ఎక్కువ, తక్కువ అయితే కేసీఆర్ బాల్ అందించడానికి పనికివస్తాడే తప్ప ఆయన ఆటగాడు ఎంతమాత్రం కాదని రేవంత్ దుయ్యబట్టారు.