ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. వైసీపీ, టీడీపీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నేత పోసాని కృష్ణ మురళి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని… ఎవరికీ మింగుడు పడని విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఫేక్ ముఖ్యమంత్రి అని… వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు నీచంగా మోసాలు చేస్తారని..చంద్రబాబుకు పదవిపై పిచ్చి అని.. ప్రజలు తిరగబడాలన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఎవరి మాటలో విని ప్రభుత్వంపై వ్యతిరేకత, కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఎప్పుడూ సీఎం సీట్లో కూర్చోవాలనే చంద్రబాబు ఆరాటపడుతుంటారని… చంద్రబాబుతో చర్చకు నేను సిద్దమని…జగన్ ఎలా అవినీతి పరుడో నిరూపించాలని పేర్కొన్నారు. జగన్.. అవినీతి పరుడని నిరూపిస్తే తాను చంద్రబాబు కాళ్లకు దండం పెట్టి, ఫొటో మెడలో వేసుకుని రాష్ట్రమంతా తిరుగుతానని సవాల్ విసిరారు. అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని… మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే మద్దతివ్వాలని కోరారు. జగన్లో ఉన్న సుగుణాలు తనకు నచ్చే మద్దతిస్తున్నానని…తాను పదవుల కోసమో, పనుల కోసమో జగన్ కు మద్దతివ్వలేదన్నారు. వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు నడవబోవని స్పష్టం చేశారు పోశాని.