కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు కొత్త పథకాలను ప్రారంభించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కొత్త పథకాల నిధుల కోసం అభ్యర్థనలు పంపవద్దని అన్ని శాఖలకు తెలియజేశామని వెల్లడించారు. నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని అన్నారు. అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మల చెప్పారు. ఒకవేళ తాజా నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే ఖర్చుల శాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.