ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ఓ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది. కనెక్ట్ టు ఆంధ్ర పేరుతో ఓ వెబ్ సైట్ ను తీసుకువచ్చారు. ఏపీలో ప్రభుత్వ పథకాలకు సాయం చేయాలనుకునే కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు, ఎన్నారైలు ఈ వెబ్సైట్ ద్వారా సహాయం చేయవచ్చు అంటూ తెలిపింది జగన్ సర్కార్. మీరు చేసే సాయం మీ గ్రామానికి లేదా నియోజకవర్గానికి లేదా జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఎంత మొత్తాన్నైనా సహాయం చేయొచ్చు అంటూ సూచించారు. కనెక్ట్ టు ఆంధ్ర వెబ్ సైట్ లో రాష్ట్ర అభివృద్ధికి సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
దీనికి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తనకు ఎమ్మెల్యేగా అసెంబ్లీ నుంచి వచ్చే జీతభత్యాలు మొత్తం కనెక్ట్ టూ ఆంధ్రాకు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని తెలియజేస్తూ ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ సమర్పించారు. అసెంబ్లీ నుంచి తన ఐదేళ్ల కాలానికి పొందే మొత్తం జీతభత్యాలను కనెక్ట్ టూ ఆంధ్రా కు బదిలీ చేయాలనీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోరారు. 2019 నవంబర్ నుంచి ఎమ్మెల్యేగా తన పదవీకాలం పూర్తి అయ్యే వరకు వచ్చే వేతనాలు కనెక్టు టూ ఆంధ్రాకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మే 30 నుంచి ప్రారంభం కాగా… ఇప్పటివరకు ఐదు నెలలు పూర్తి అయ్యాయి ఇంకో 55 నెలల పదవీకాలం మిగిలి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే కు మొత్తంగా కలిపి నెలకు 1.95 లక్షల వరకు జీత భత్యాలు వస్తాయి… అంటే యాభై ఐదు నెలల కాలానికి వచ్చే జీతం మొత్తం కలిపి కోటి రూపాయల వరకు వస్తాయి . ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనెక్ట్ టు ఆంధ్ర డొనేట్ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయమే.