జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారుపాల్యం మండలం మొగిలి ఘాట్ వద్ద కంటైనర్ లారీ వాహనాలపై దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. బ్రేకులు విఫలం కాడంతో ఆటో, ఓమ్ని వ్యాన్, ద్రిచక్ర వాహనంపైకి కంటైనర్ దూసుకెళ్లింది. మృతుల్లో కంటైనర్ డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు సమచారం. పలువురికి తీవ్రగాయాలు కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో పలమనేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి పడటంతో పోలీసులకు మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆయన సూచించారు.
మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతులు రామచంద్ర (50), రాము (38), సావిత్రమ్మ (40), ప్రమీళ (37), గురమ్మ (52), సుబ్రమణ్యం (49), శేఖర్ (45), పాపమ్మ (49), వీరందరూ గంగవరం మండలం మరిమాకుల పల్లె గ్రామానికి చెందిన వారు. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కంటైనర్ కిందపడిన ద్విచక్ర వాహనం దారుడు నరేంద్ర (37) మృతి. ఇతనిది పలమనేరు మండలం బలిజపల్లిగా గుర్తించారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.