దేశ వ్యాప్తంగా సొంతంగా 114 ఆధార్ సేవా కేంద్రాలను ప్రారంభించేవిధంగా ప్రణాళికలు వేసుకున్న భారత విశిష్ట సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తాజాగా దిల్లీ, విజయవాడల్లో ఆ కేంద్రాలను ప్రారంభించింది. ఆధార్ నమోదు, మార్పులు వంటి సేవలను ఈ కేంద్రాలు అందిస్తాయని చెప్పారు. ఇప్పటికే బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇతర కేంద్రాల్లో ప్రజలు ఈ సేవలను ఇతరుల ద్వారా అందుకుంటున్నారు. త్వరలోనే నేరుగా యూఐడీఏఐ సొంత కేంద్రాల్లో దేశంలోని 53 నగరాల్లోని 114 ప్రాంతాల్లో ఈ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి కేంద్రాలు దిల్లీ, విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి.
ఆధార్ సేవా కేంద్రంలో ఒకే రోజులో దాదాపు 1,000 మంది వాటి ద్వారా సేవలు అందుకోవచ్చు. ప్రభుత్వ సెలవు దినాలతోపాటు మంగళవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. విజయవాడలో ప్రారంభించిన కేంద్రంలో రోజుకి 500 మంది సేవలు అందుకోవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మధ్య ఖర్చు అవుతుందని అంచనా. పాస్ పోర్టు సేవా కేంద్రాల మాదిరిగా వీటి సేవలను అందించాలని భావిస్తున్నారు. ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తమకు వీలైన సమయంలోనే వెళ్లి సేవలను పొందొచ్చు.