గత జగన్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.
జాతీయ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(బుధవారం) అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు.
ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను విని పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కల్యాణ్.
కోనసీమ రైతులకు గళామవుతా గొంతువవుతానని ధైర్యం చెప్పారు. అన్నదాతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే తాను ఇక్కడకు వచ్చానని ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు.
శంకరగుప్తం డ్రైన్తో తాగునీటి జలాలు ఉప్పుమయంగా మారాయని వివరించారు. జిల్లాలో డ్రైన్ ఆధునికీకరణకు రూ.4వేల కోట్లు అవసరమని తెలిపారు.
రైతులు తనను సినిమా తీసి డబ్బులు ఇవ్వమంటున్నారని పైసలు ఎవరి జేబు నుంచి ఇచ్చేవి కావని స్పష్టం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మాటిచ్చారు.
రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. డిసెంబరు రెండో వారంలో రైతన్నలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
శంకరగుప్తం డ్రైన్ సమస్యపై తన పేషీ అధికారులు ఇచ్చిన నివేదికను చదివి వినిపించారు పవన్ కల్యాణ్.
కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
శంకర్ గుప్తం డ్రైయిన్కు ఉన్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు.
గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోశయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టేశారని నిలదీశారు.
డిసెంబరు రెండో వారంలో ఇదే సమస్యపై రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.

