telugu navyamedia
National వార్తలు విద్యా వార్తలు

జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో ముగ్గురు తెలుగు రాష్ట్రా విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను మరోసారి చాటారు.

జాతీయ పరీక్షల మండలి (NTA) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్ల జాబితాలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్థానం సంపాదించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ లతో పాటు తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహీశ్వరి ఈ ఘనత సాధించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. ఎస్సీ కేటగిరిలో ఏపీకి చెందిన దేవ శ్రీవేద్ టాపర్ గా నిలిచాడు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ఏడాది జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 13,55,293 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 13,04,653 మంది (96.26%) హాజరయ్యారు.

సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో బీఈ/బీటెక్ (పేపర్ 1) విభాగంలో 12 మంది విద్యార్థులు నూటికి నూరు శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా రాజస్థాన్ నుంచి ముగ్గురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు.

మహిళల విభాగంలో హర్యానాకు చెందిన అషి గ్రేవాల్ పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్లయిన jeemain.nta.nic.in మరియు nta.ac.in నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నార్మలైజేషన్ పద్ధతి ద్వారా తుది పర్సంటైల్‌ను లెక్కించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.

ఈ సెషన్‌లో ఆశించిన స్కోరు రాని విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఏప్రిల్ 2026లో జరగనున్న రెండో సెషన్ పరీక్షలకు హాజరై తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. రెండో సెషన్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

జేఈఈ మెయిన్స్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. దీని ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్లు

నరేంద్రబాబు గారి మహిత్ (ఆంధ్రప్రదేశ్),  శుభమ్ కుమార్ (బిహార్), కబీర్ చిల్లార్ (రాజస్థాన్), చిరంజీబ్ కర్ (రాజస్థాన్), భవేష్ పాత్రా (ఒడిశా), అనయ్ జైన్ (హర్యానా) మరియు అర్ణవ్ గౌతమ్ (రాజస్థాన్).

పసల మోహిత్ (ఆంధ్రప్రదేశ్), మాధవ్ విరాడియా (మహారాష్ట్ర), పురోహిత్ నిర్మయ్ (గుజరాత్), వివన్ శరద్ మరియు మహీశ్వరి (తెలంగాణ)

Related posts