టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు హత్యకు కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది. నిన్ను హత్య చేసేందుకు ఓ షూటర్ని మా బాస్ నియమించాడు’’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడని చింతమనేని చెబుతున్నారు.
తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే శనివారం ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఈ బెదిరింపు కాల్స్ కి సంబంధించి చింతమనేని ప్రభాకర్ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.
అగంతకుడి ఫోన్ కాల్పై దర్యాప్తు చేసి.. తన భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గన్మెన్ల జీతానికి వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే స్థోమత తనకు లేదని.. పోలీసులే ఉచితంగా భద్రత కల్పించాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను ఎన్కౌంటర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని.. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించి విఫలమైందని ఆయన ఆరోపించారు.
టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడినని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన లాయర్కు సజ్జల వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.. ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని ఏలూరు కోర్టును ఆయన ఆశ్రయించారు