ఉగ్రవాదులు పండుగ కోసం సెలవుపై వచ్చిన టెరిటోరియల్ ఆర్మీ జవానును ఇంట్లోకి చొరబడి మరీ పొట్టనబెట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో గురువారం ఈ దారుణం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మృతుడిని సదూరాకి చెందిన అబ్దుల్ సలాం బేగ్ కుమారుడు మంజూర్ అహ్మద్ బేగ్గా గుర్తించారు.
ఈద్ వేడుకల కోసం సదరు జవాను ఈ నెల 4 నుంచి 12 రోజుల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో ఆయన నిరాయుధుడిగా ఉండగా… ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కాగా హంతకులను పట్టుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.