తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు ఈ నెల 30న సెలవులు ఇవ్వగా .. కొన్ని రోజులు నుంచి ఆన్లైన్ బోధనలు జరుగుతున్నాయి. అయితే మరో రెండు రోజుల్లో విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు ముగియనుండటంతో.. విద్యా సంస్థల ప్రారంభంపై తీవ్ర కసరత్తు చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి.
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా విద్యాసంస్థలు తెరిచేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది.. సెలవులు 30 వరకే ఉన్నా ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ రీ-ఓపెన్ అవ్వనున్నాయి.
విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల సర్కార్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. పదో తరగతి పరీక్షలు కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.