*ఇలాంటి సీఎం ఉండడం దౌర్భాగ్యం..
*అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని జగన్ చెప్పలేదా?
*మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమను సభ నుంచి సస్పెండ్ చేశారు
తమ పార్టీ అధికారంలోకి వస్తే మధ్య నిషేధం విధిస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ హామీ ఇవ్వలేదా అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.. గురువారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. మద్యం కంపెనీలు, షాపులు తమ చేతిలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే మద్యం పాలసీని వైఎస్ జగన్ మార్చారని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు పెరిగాయన్నారు.2014-15లో మద్యం విక్రయాల ద్వారా రూ.11,569 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.2021-22లో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 24,714 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. నాటుసారా మరణాలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని తాము అసెంబ్లీలో కోరితే సస్పెండ్ చేస్తారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మద్యంపై ఆదాయాన్ని తగ్గిస్తానని చెప్పిన పెద్దమనిషి ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకోవడం మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో తెచ్చిన డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలన్నారు.
చంద్రబాబు పథకాలను రద్దు చేసిన జగన్ కు డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. డిస్టిలరీలన్నీ జగన్ బినామీల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రతి మాట అవాస్తవమన్నారు
సీఎం జగన్ ఆరోపించిన విధంగా సీ బ్రాండ్ అంటే.. ఏపీ అభివృద్ధికి బ్రాండ్ అన్నారు. హైదరాబాద్ లాంటి అభివృద్ధే సీ బ్రాండ్ అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు సీ బ్రాండ్ ఉంటుందన్నారు. మద్యంపై ఆదాయం రాలేదంటే అమ్మఒడి, పెన్షన్లు ఇవ్వలేనని సీఎం చెప్పడం మన దౌర్భాగ్యమన్నారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి పథకాలిస్తామని సీఎం ఎందుకు చెప్పలేదని అచ్చెన్న నిలదీశారు.

