టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి వైఎస్ఆర్సీపీ పై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ రాజీనామాలు చేసేందుకు సిద్ధమని .. వైఎస్ఆర్సీపీ సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
మంగళగరిలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి చెందిన అంశాలపై వైఎస్ఆర్సీపీ అవకాశవాదంతో వ్యవహరిస్తూండటాన్ని తప్పు పట్టారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు అంశాల్లో కేంద్రం వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నా స్పందించడంలేదని విమర్శించారు.
ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రకటించిందని.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. కానీ ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేంద్రం తేల్చిచెప్పిందన్నారు.
ఎంపీలను గెలిపిస్తే మెడలు వంచి హోదా తీసుకు వస్తామనిజగన్ గతంలో చెప్పారని ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.
వైఎస్ఆర్సీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. రోజురోజుకు వైఎస్ఆర్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమే జరుగుతోందని ఆయన అన్నారు.

