వంద శాతం సివరేజ్ ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బుధవారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఓ పీపుల్స్ ప్లాజా వద్ద చెత్త తరలించే 40 అత్యాధునిక వాహనాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తే రోజూ దాదాపుగా 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల చెత్తను నగరం నుంచి జవహర్ నగర్ డంప్నకు తరలించనున్నారు.
నగరంలో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను రోజూ తరలిస్తున్నామన్నారు. 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, మరో 400 ఆటోలు నెల రోజుల్లో రాబోతున్నాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్తో చెరువుల్లో చెత్త, గుఱ్ఱపుడెక్క వంటి వాటిని తొలగించనున్నామని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా చెత్త తరలింపు జరుగుతోందని, దక్షిణాదిలో చెత్త నుంచి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న నగరం హైదరాబాదేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయానికి అంతా సహకరించాలన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి కావాలనే సీఎం కేసీఆర్ ఆశయంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.