ఈ రోజు సూపర్స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానుల జోష్ కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన విజువల్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా తరువాత సూపర్స్టార్ మహేశ్బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పూర్తి వివరాలను చిత్రబృందం ప్రకటించింది. మహేశ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను వెల్లడించింది చిత్ర బృందం.
ఇప్పటివరకు ఈ సినిమాలో మహేశ్కు జోడీగా ఎవరు నటిస్తారన్న సస్పెన్స్ను తెరదించుతూ బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్గా అనౌన్స్ చేసింది. ఇదివరకు వీరిద్దరూ ‘మహర్షి’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం మహేశ్ పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేశ్-త్రివిక్రమ్ కాంబో సెట్స్పైకి వెళ్లనుంది.