ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు.
లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు.
విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు.
భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు.
మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు… ఆచరించారని అలాగే ఫలితం చూపించారని సీఎం వెల్లడించారు.
బాబాతో తనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు తనతో చర్చించారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించారన్నారు.
102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయన్నారు.
సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలందుతున్నాయని తెలిపారు.
రాయల సీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు.
ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకుపైగా జనాభాకు నీరిచ్చారన్నారు.
చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారని సీఎం తెలిపారు. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
కాగా శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
బాబా జయంతిని పురస్కరించుకుని రూ.100 విలువైన స్మారక నాణేన్ని ప్రధాని విడుదల చేశారు.
అలాగే శ్రీసత్యసాయి స్మారక తపాలా బిళ్లల్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విడుదల చేశారు.

