జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు. సంజయ్ పై అనర్హత కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు.
దానిని కొట్టేస్తూ స్పీకర్ ఇవాళ తీర్పును వెలువరించారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని సభాపతి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి ఈ నెల 6లోపు పురోగతిని సుప్రీంకోర్టుకు స్పీకర్ నివేదించాల్సి ఉంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. అందులో భాగంగా ఇప్పటికే 8మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేశారు.
ఇందులో సంజయ్ మినహా మిగతా ఏడుగురి పిటిషన్లను కొట్టేశారు. సంజయ్ పిటిషన్ పై తీర్పును ఇవాళ ప్రకటించారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్ల విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. తన జీతం నుంచి నెలకు రూ.5వేలు ఆ పార్టీకి కట్ అవుతున్నట్లుగా తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చానని సంజయ్ తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు పెట్టి, విప్ జారీ చేస్తే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
జగిత్యాల అభివృద్ధి కోసం సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని వివరించారు.

