రజినీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోంది. రజినీకాంత్ ప్రధానపాత్రలో “కొచ్చడయాన్” అనే యానిమేషన్ చిత్రాన్ని రూపొందించి దర్శకురాలిగా మారారు సౌందర్య. తన బావ, హీరో ధనుష్ తో “విఐపి-2” చిత్రాన్ని రెండవ చిత్రంగా రూపొందించారు. ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టారు. మొదటిసారిగా ఓ చారిత్రాత్మకంగా “పొన్నియన్ సెల్వన్” అనే ప్రాజెక్ట్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎంఎక్స్ ప్లేయర్ స్ర్టీమింగ్ ప్లాట్ఫాం కోసం తన మే6 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ వెబ్సిరీస్ను నిర్మించనున్నారు. ఈ విషయంపై సౌందర్య స్పందిస్తూ ”ఈ నవలను చదివినప్పటి నుండి ఇలాంటి చారిత్రాత్మక కథను విజువల్ గా చూపించాలని ఆశపడ్డాను. అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది. వెబ్ సిరీస్లో “పొన్నియన్ సెల్వన్”ను తెరకెక్కించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
మరోవైపు ఇదే ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎన్నో ఏళ్లుగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సౌందర్య చేసిన ప్రకటన ఆయన అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. “సెక్క సివంద వానం” చిత్రం తరువాత తన డ్రీమ్ ప్రాజెక్టు “పొన్నియన్ సెల్వన్”ను పట్టాలెక్కించడానికి మణిరత్నం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బడ్జెట్, తారాగణం ఎంపిక తదితర ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో విక్రమ్, విజయ్ సేతుపతి, జయంరవిలలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ విన్పిస్తోంది. ఇలాంటి తరుణంలో సౌందర్య రజనీకాంత్ నుంచి వెబ్సిరీస్ ప్రకటన వెలువడడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు సమాచారం.