దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష ఖరారు అయ్యింది.రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 60లక్షలు జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది.
దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా పేర్కొంటూ గత వారం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. జార్ఖండ్లోని డోరాండా ట్రెజరీ నుంచి రూ.139.35 కోట్లను అక్రమంగా విత్డ్రా చేయడంపై ఐదో కేసు నమోదైంది.
ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపింది రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
జార్ఖండ్లోని దుమ్కా, దేవ్ఘర్, చైబాసా ట్రెజరీలకు సంబంధించిన మరో నాలుగు కేసుల్లో 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్కు గతంలో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.
బీహార్కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాపైనా సీబీఐ అభియోగాలు మోపింది.
2013 సెప్టెంబర్లో దోషిగా తేలి, తొలిసారి రాంచీ జైలుకు వెళ్లారు లాలూ. 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. అయితే.. 2017 డిసెంబర్లో మరో కేసులో దోషిగా తేలగా.. లాలూ బిర్సా ముండా జైలుకు వెళ్లారు. 2021 ఏప్రిల్లో ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్న ఆరవ కేసు బీహార్లోని బంకా ట్రెజరీ నుండి ఉపసంహరణలకు సంబంధించినది.. అది ఇంకా విచారణలో ఉంది.

