ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి లోక్సభ నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నించిన “బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్” కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో సంచలనం రేపుతోంది. ₹50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని ఆయన చెప్తున్నట్టుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సమాజ్ వాదీ తరఫున వారణాసిలో తేజ్ బహదూర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పలుతప్పిదాల కారణంగా ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన రెండేళ్ల కిందట వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఎంతవరకు ప్రామాణికమైనదనే అంశం ఇంకా తేజ్ బహదూర్ తేలలేదు.
తేజ్ బహదూర్, జాతీయ చానెళ్లలో ప్రసారమైన వీడియోలో ఒక స్నేహితుడితో మాట్లాడుతూ, ₹ 50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని చెప్పాడు. పాక్ ఆ డబ్బు ఇస్తుందని స్నేహితుడు బదులివ్వగా, తాను దేశభక్తుడినని, ఆ దేశ సాయం తీసుకోబోనని, భారతీయుడు ఎవరైనా డబ్బు ఇస్తే, ఈ పని చేస్తానని అతను చెప్పుకొచ్చినట్టు ఈ వీడియో లో సంభాషణ ఉంది. ఈ వీడియో పై అధికార బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తి ₹ 50 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర చేయడం షాకింగ్ ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ వీడియో మార్ఫింగ్ చేశారని, ఇది ఫేక్ వీడియో అని తేజ్ బహదూర్ అంటున్నారు.