telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రామ్మోహన్ నాయుడు భారత విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయడంపై దృష్టి సారించాలి: విజయసాయి రెడ్డి

భారత విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయడంపై తక్షణమే దృష్టి సారించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు.

దేశంలో విమాన ప్రయాణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, భద్రతాపరమైన చర్యలు కూడా అదే స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయసాయి రెడ్డి తన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “భారత్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతోంది.

2047 నాటికి దేశవ్యాప్తంగా 400 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నప్పుడు, ఆ వృద్ధికి తగ్గట్టుగా విమాన ట్రాఫిక్ భద్రతను కూడా మెరుగుపరచాలి” అని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనల వల్ల ప్రయాణికుల్లో భద్రతపై విశ్వాసం సన్నగిల్లుతోందని విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను ఆధునికీకరించాలని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో సిబ్బందిని, సాంకేతికతను బలోపేతం చేయాలని సూచించారు.

విమానాల నిర్వహణలో లోపాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కీలకమైన అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts