హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నారు. అతడి కుటుంబ సభ్యులు అవయవ మార్పిడి కోసం జీవన్దాన్ ఫౌండేషన్ లో పేరు నమోదు చేయించారు. పుణెలో ఓ వ్యక్తి బ్రెయిన్డెడ్ కావడంతో అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకొచ్చారు. పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్ రావడంతో తెలంగాణ జీవన్దాన్ ఫౌండేషన్ ఇంఛార్జ్ నేతృత్వంలో ఊపిరితిత్తులు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఊపిరితిత్తుల్ని జాగ్రత్తగా తీసుకుని ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేటకు తరలించారు. అక్కడి నుంచి కిమ్స్కు ఊపిరితిత్తులు చేరాయి. వెంటనే డాక్టర్లు బాధితుడికి అమర్చారు. సర్జరీ కూడా విజయవంతమైంది. ఒక ప్రాణం నిలిపేందుకు 560 కి.మీ. దూరం నుంచి గంట వ్యవధిలో ఊపిరితిత్తులు తీసుకొచ్చారు. అటు పుణె, ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధికారులు సహకారం అందించడంతో ఇది సాధ్యమైంది.