telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు రాజకీయ వార్తలు

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు మేనేజర్‌గా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు పీవీఆర్ ప్రశాంత్‌ నియామకం

భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్‌ను టీమిండియా మేనేజర్‌గా నియమించారు.

త్వరలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు ఆయన భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రశాంత్, గతంలో పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించారు.

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘ‌నిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి.

ఈ కీలక టోర్నమెంట్‌లో జట్టు మేనేజ్‌మెంట్ బాధ్యతలను ప్రశాంత్ పర్యవేక్షించనున్నారు.

ప్రశాంత్ రాజకీయంగా కూడా సుపరిచితమైన కుటుంబానికి చెందినవారు. ఆయన భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు కుమారుడు.

అంతేకాకుండా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు స్వయానా అల్లుడు.

కాగా, భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 1997లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా విశాఖ‌ప‌ట్నం మాజీ మేయర్ డీవీ సుబ్బారావు టీమిండియాకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా సేవలు అందించారు.

చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రశాంత్‌కు ఈ అవకాశం దక్కడం విశేషం.

Related posts