నేడు ఏపీలో పింఛన్ పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు ఆయా పంచాయతీ కార్యాలయాలకు లేటుగా చేరుకోవడంతో అప్పటికే అక్కడ పడిగాపులు కాస్తున్న వృద్దులు క్యూ లో నిలబడలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే, అధికారులు వచ్చాకే, పింఛన్ పంపిణి చేస్తామని బదులు ఇవ్వడంతో అనేకమంది వృద్దులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఒక వృద్ధురాలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పింఛన్లు ఇస్తారని వెళ్లిన ఓ వృద్ధురాలు బిపి డౌన్ అయ్యి ప్రాణం విడిచిన ఘటన శనివారం ఉదయం నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది.
పింఛన్లు, కుంకుమ నగదు కోసం శనివారం ఉదయం తొందరగా రావాలని అక్కడి నాయకులు, డ్వాక్రా నేతలు చెప్పడంతో.. జనం ఈ రోజు ఉదయం 6 గంటలకే ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా కొన్ని చోట్ల సభలు ప్రారంభం కాలేదు. మరి కొన్ని చోట్ల మండుటెండలో, కనీసం మంచి నీరు కూడా లేని దురవస్థలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సదుం మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన ఆటో మస్తాన్ తల్లి ఎస్.షరీఫా (77) ఈ రోజు ఉదయం పెన్షన్ తీసుకోవడానికి వెళ్లింది. అకస్మాత్తుగా బిపి డౌన్ అయ్యి వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణం విడిచింది. పింఛన్ రెట్టింపయ్యింది.. తీసుకుందామని తన తల్లి చక్కగా తయారయ్యి వెళ్లి, విగతజీవిగా రావడంతో ఆమె కుమారుడు ఆటో మస్తాన్ కన్నీటి పర్యంతమయ్యాడు.