నేటి యువత సోషల్ మీడియా వేదికపై ఆసక్తి కనబరుస్తూ కొత్త పరిచాయల పై మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా వెనుకాముందు ఆలోచించకుండా ఆర్థిక పరమైన లావాదేవీలు చేసి ఘరానా మోసానికి గురవుతున్నారు. హైదరాబాద్ బేగంపేట్లో నివాసముండే వర్షిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి రెండు నెలల పాటు స్నేహం చేశారు. ఆ తరువాత మలేషియా, ఇండియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని నమ్మించి రూ.47లక్షలు ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉన్నవారు స్నేహం చేస్తున్నారంటే ఆలోచించకుండా చాలా మంది స్నేహం చేస్తుంటారు. ఇందులో కొందరు స్నేహం, ప్రేమ, పెండ్లి, వ్యాపారం పేర్లతో సైబర్ నేరగాళ్లు వేసే వలలో చిక్కుకుంటున్నారు.
వ్యాపార భాగస్వాములమవుదామంటూ నమ్మిస్తూ ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తనకు పరిచయం అయిన స్నేహితుడి ద్వారా భారీగా లబ్ధి పొందవచ్చనే భావనతో మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. సోషల్మీడియాలో కొత్తవారితో పరిచయాలు ఎప్పుడో ఓ సారి అనర్ధాలను తెచ్చేందుకు అవకాశాలుంటాయి. ఇలా తనకు భారీగా డబ్బులు, ఆభరణాలు వచ్చేస్తున్నాయనే భ్రమలో అత్యాశకు పోయి మోసపోతున్న వారిలో ప్రొఫిషనల్ చదువులు చదివిన వారే ఉంటున్నారు. కేవలం చాటింగ్తోనే లక్షల రూపాయలు బ్యాం కుల్లో డిపాజిట్ చేస్తున్నారు.
జాన్ అనే యువకుడు వర్షినికి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి అన్నింటికి అతడు చెప్పినట్టే నడచుకొంది. అతడు వీడియో చాటింగ్కు నిరాకరించినప్పుడైనా వర్షిని పసిగట్టలేదు. అతడు చెప్పినట్లే మలేషియా నుంచి బ్యాంకు ప్రతినిధి ఫోన్ చేశాడు, జాన్కి సంబంధించిన డబ్బు మీ ఖాతాకు బదిలీ చేయాలంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని సూచించాడు. యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్, ఆర్బీఐ క్లియరెన్స్ జీఎస్టీ తదితర సర్టిఫికెట్లు కావాలంటూ సూచించాడు. ఇలా తన వద్ద సర్టిఫికెట్లు లేవంటూ చెప్పడంతో.. తాను వాటిని సమకూర్చుకుంటామని, వాటికి డబ్బు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని బ్యాంకు ప్రతినిధులు కోరారు. దీంతో వర్షిని వాళ్లు చెప్పినట్లు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తూ వచ్చింది. బ్యాంకు లోన్ తీసుకొని మరీ సైబర్ఛీటర్లకు చెల్లించింది. రూ.47లక్షలు చెల్లించినా కూడా క్లియరెన్స్లంటూ ఫోన్లు చేస్తుండడంతో ఇదంతా మోసమని గ్రహించి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.