పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యల కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మురళీకృష్ణతో పాటు సాక్షి న్యూస్ ఛానల్ను కూడా ఈ కేసులో చేర్చారు. అమరావతి వల్లే పొన్నూరు ప్రాంతంలోని పొలాలు ముంపునకు గురయ్యాయంటూ ఆయన చేసిన ఆరోపణలు ఈ పరిణామానికి దారితీశాయి.
వివరాల్లోకి వెళితే, అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కారణంగానే పొన్నూరులోని వ్యవసాయ భూములు నీట మునుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై అప్పాపురం కాలువ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విపత్తుల పేరు చెప్పి, అవాస్తవాలతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏఈఈ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం అంబటి మురళీకృష్ణతో పాటు ఈ వార్తను ప్రసారం చేసిన సాక్షి ఛానల్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఆందోళన కలిగించేలా వ్యాఖ్యలు చేయడం పట్ల అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలి: జీవీఎల్