మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అన్నయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశమిచ్చారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా చిరంజీవి ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అఫీషియల్ మెసేజ్ పోస్ట్ చేశారు. ”అన్నయ్య చిరంజీవి గారు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే గాక.. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య చిరంజీవి గారు కరోనా బారిన పడ్డారని తెలిసి మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్కు వ్యాక్సిన్ కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచమంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య శాఖ నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కాగా ఆచార్య షూటింగ్లో పాల్గొనేందుకు గాను కరోనా టెస్ట్ చేయించుకోగా… చిరంజీవికి పాజిటివ్ అని తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ తనను గత 4-5 రోజులుగా కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరారు మెగాస్టార్.
అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/AuVupQ0maM
— JanaSena Party (@JanaSenaParty) November 10, 2020


మరోసారి హిందూమతం మీద కామెంట్ చేసిన కమలహాసన్