రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వి. వి శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికరమైన సంఘటన. ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు.
ఆయన సలహాతో వీ.వీ. శాస్త్రి వెళ్లి మీనన్ ను కలుసుకుని రేడియో కేంద్రానికి ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు. మీనన్ గారు ఆరోజు చెప్పిన విషయాల్లో ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది కావడం వల్ల శాస్త్రి గారికి బాగా గుర్తుండిపోయింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అనేక సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం ఏడవ నవాబు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ప్రతిఘటించాడు.
దాంతో దీనిపై ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను హైదరాబాదు పంపే విషయంలో సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా ఇలా అన్నారట.
‘”ఇండియన్ ఆర్మీ ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.” పటేల్ మాటలు విని సమావేశంలో వున్న వారంతా మ్రాన్పడి అలా పటేల్ వంక చూస్తుండిపోయారట. ఇక ప్రధాని నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు. 1948 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రికి తెలియకుండా ఆయన మంత్రి వర్గంలో వున్న వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పుడు ఇప్పుడు ఊహకు అందని విషయం. కానీ నెహ్రూ హయాములో జరిగింది.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి స్వతంత్ర నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో 1948 సెప్టెంబర్ 17న విలీనం చేశారు.
– భండారు శ్రీనివాసరావు
నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారు: పవన్